డిఎస్ రాజీనామా కోసం పెరుగుతున్న ఒత్తిడి
హైదరాబాద్: తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై తీవ్రంగా పడింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తాను ఓటమి పాలు కావడమే కాకుండా అన్ని స్థానాల్లో కాంగ్రెసు అభ్యర్థులు ఓడిపోవడంతో ఈ ఒత్తిడి పెరుగుతోంది. పిసిసి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. రాజీనామాకు డిఎస్ సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి డిఎస్ ఓడిపోవడం ఇది నాలుగోసారి కాగా, పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇది రెండోసారి.
ఎన్నికల్లో పార్టీని గెలుపు బాటలో నడిపించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనే విమర్స పార్టీలోని కొంత మంది నుంచి వస్తోంది. అన్ని స్థానాల ఎన్నికల బాధ్యతను భుజాన మోయాల్సిన ఆయన తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. అయినా ఆయన విజయాన్ని సాధించలేకపోయారు. ఈ ఓటమి ప్రభావం ఆయన వ్యక్తిగత రాజకీయ జీవితంపై పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
